అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ సీనియర్ మృతి

చదివే సమయం: 1 నిమిషాలు

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్‌డబ్ల్యు బుష్ (94 ఏళ్లు) చనిపోయారని ఆయన కుమారుడు, మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యు బుష్ ప్రకటించారు.

జార్జ్ బుష్ సీనియర్‌గా పేరొందిన ఆయన అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 10.10 గంటలకు మృతి చెందారని ఆయన కుటుంబం తరపున వెలువడిన ప్రకటనలో పేర్కొన్నారు.

రెండో ప్రపంచ యుద్ధంలో ఆయన అమెనికా నేవీలో (యుద్ధ విమానాలను నడిపే) ఏవియేటర్‌గా పనిచేశారు. అనంతరం టెక్సాస్ రాష్ట్రంలో చమురురంగ దిగ్గజంగా పేరొందారు.

1964లో ఆయన రిపబ్లికన్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు.

అమెరికా కాంగ్రెస్ సభ్యుడిగా, రాయబారిగా, డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ)గా కూడా పనిచేసిన సీనియర్ బుష్ రొనాల్డ్ రీగన్ హయాంలో 1981 నుంచి 1989 వరకు అమెరికాకు రెండుసార్లు ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.

1989లో ఆయన అమెరికా అధ్యక్షుడయ్యారు. 1993 వరకూ ఆ పదవిలో కొనసాగారు.

ప్రజాకర్షణ రేటింగ్ 90 శాతం సాధించినప్పటికీ.. దేశీయ వ్యవహారాలను నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన 1992 ఎన్నికల్లో బిల్ క్లింటన్ చేతిలో ఓడిపోయారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయన భార్య బార్బరా మృతి చెందిన వారం రోజులకు ఆయన ఆస్పత్రిలో చేరారు. ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయనను వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.

సీనియర్ బుష్‌కు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమారుడు జార్జ్ డబ్ల్యు బుష్ అమెరికా 43వ అధ్యక్షుడిగా పనిచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)