You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కిమ్ జోంగ్ ఉన్కు రైఫిల్ గిఫ్ట్ ఇచ్చిందెవరు?
- రచయిత, కోహ్ ఈవ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 3 నిమిషాలు
రష్యాకు మిత్రదేశాలైన ఉత్తరకొరియా, బెలారస్ నాయకులు కత్తి, రైఫిల్లను బహుమతులుగా ఇచ్చిపుచ్చుకున్నారు.
ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ దీనికి వేదికయింది.
ఉత్తరకొరియా నేత కిమ్ జోంగ్ ఉన్కు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో ఓ రైఫిల్ను బహుమతిగా ఇచ్చారు.
ప్యాంగ్యాంగ్లో వారిద్దరూ రెండు దేశాల మధ్య స్నేహపూర్వక ఒప్పందంపై సంతకం చేశారు.
యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఈ ఇద్దరు నాయకులు కీలక స్నేహితులుగా ఉన్నారు. ఇకపై తమ రెండు దేశాలు మరింతగా సహకరించుకోవాలని, పాశ్చాత్య దేశాల ఒత్తిడిని ఎదుర్కోవాలని నిర్ణయించారు.
''శత్రువులు వస్తే ఉపయోగపడుతుంది'' అని కిమ్తో అంటూ బెలారస్ అధ్యక్షుడు లుకాషెంకో ఆయనకు ఆటోమేటిక్ రైఫిల్ ఇచ్చినట్టు బెలారస్ ప్రభుత్వ మీడియా వీడియోలో ఉంది.
దానికి బదులుగా లుకాషెంకోకు కిమ్ ఓ కత్తి బహుమతిగా ఇచ్చారు. దీంతో పాటు బెలారస్ నాయకుడి బొమ్మ ఉన్న ఫ్లవర్ వాజ్ అందించారు.
‘ఉత్తరకొరియాకు మంచి భవిష్యత్తుంది’
''ఓ స్నేహితుడిలా.. ఈ ప్రపంచంలో ప్రతిదీ చూసిన వ్యక్తిగా నీకు చెప్తున్నా...ఇలా కష్టపడి, అంకితభావంతో పనిచేసే ప్రజలున్న మీ దేశానికి గొప్ప భవిష్యత్తు ఉంది'' అని కిమ్తో లుకాషెంకో చెప్పినట్టు బెలారస్ న్యూస్ ఏజెన్సీ బెల్టా తెలిపింది.
''అంతర్జాతీయ న్యాయసూత్రాలను బహిరంగంగా ఉల్లంఘిస్తూ పెద్దదేశాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తమ పౌరుల బాగోగుల కోసం దేశాలు స్వతంత్రను కాపాడుకోవాలి'' అని ఆయన చెప్పారు.
స్నేహపూర్వక ఒప్పందం చాలా కీలకమైని లుకాషెంకో చెప్పగా, ద్వైపాక్షిక సంబంధాలను ఈ ఒప్పందం బలోపేతం చేస్తుందని కిమ్ చెప్పినట్టు బెల్టా తెలిపింది.
వ్యవసాయం, సమాచారం, ప్రజారోగ్యం వంటి రంగాల్లో సహకరించుకోవాలని ఇద్దరు నాయకులు నిర్ణయించినట్టు ఉత్తరకొరియా ప్రభుత్వ అధికారిక వార్తాసంస్థ కేసీఎన్ఏ తెలిపింది.
‘రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో ఉత్తరకొరియా సైనికులు’
మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు, యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకు సహకరించారన్న ఆరోపణలతో ఉత్తరకొరియా, బెలారస్లు పాశ్చాత్య దేశాల ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి.
రష్యాకు ఉత్తరకొరియా సైనికులను పంపుతోందన్న ఆరోపణలున్నాయి.
యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన కొన్ని నెలల్లోనే ఉత్తరకొరియాకు చెందిన వెయ్యిమంది సైనికులు మరణించారని పాశ్చాత్య దేశాల అధికారులు గత ఏడాది బీబీసీతో చెప్పారు.
''ఉత్తరకొరియా ఎల్లప్పుడూ రష్యాతో ఉంటుందని'' ఈ వారం పుతిన్కు పంపిన సందేశంలో కిమ్ చెప్పినట్టు కేసీఎన్ఏ తెలిపింది.
యుక్రెయిన్ లక్ష్యాలపై దాడులు చేసేందుకు రష్యా.. బెలారస్ భూభాగాన్ని ఉపయోగించుకుంటోందని యుక్రెయిన్ ఆరోపించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)