You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'జగన్నాథ రథ చక్రాల్.. ' అంటూ శ్రీశ్రీ కవితను ప్రస్తావిస్తూ రాజ్యసభలో కమల్ హాసన్ తొలి ప్రసంగం..
నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ శ్రీశ్రీ కవిత్వాన్ని ప్రస్తావిస్తూ రాజ్యసభలో తన తొలి ప్రసంగం చేశారు.
ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన తన ప్రసంగం ద్వారా ఎలక్షన్ కమిషన్ను, కేంద్రాన్ని విమర్శించారు.
"ఈ సర్వేతో తమిళనాడులో సుమారు కోటి మంది బతికుండి కూడా చనిపోయే ప్రమాదముంది. స్పెల్లింగ్, అడ్రస్లో తప్పులున్నాయంటూ ఏకపక్షంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రమాదముంది" అని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య భారతాన్ని ఎవరూ అడ్డుకోలేరంటూ ఆయన శ్రీశ్రీ కవిత్వాన్ని ప్రస్తావించారు.
‘జగన్నాథ రథచక్రాలొస్తున్నాయ్...వస్తున్నాయ్’ అంటూ శ్రీశ్రీ కవితలోని ఒక లైన్ చదివారు.
బిహార్లో జరిగిన ఎస్ఐఆర్ను ప్రస్తావిస్తూ, ఆ రాష్ట్రం "జీవచ్ఛవాల భూమి"గా మారిందని, ఆ వ్యాధి దేశమంతటా వ్యాపించకూడదని ఆయన హెచ్చరించారు.
ఈ వ్యాధిని వ్యాప్తి చేసేందుకు ఎన్నికల సంఘం సహకరిస్తోందని ఆయన అన్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సర్వేకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రయత్నాలకు ఆయన మద్దతు తెలిపారు.
అయితే, ఎస్ఐఆర్పై వస్తున్న విమర్శలను ఎన్నికల సంఘం తిరస్కరిస్తూ వస్తోంది.
సినిమాల నుంచే వచ్చాను..
ఈ సభలోకి చాలా మంది వివిధ రంగాల నుంచి వచ్చారని, తాను సినిమాల ద్వారానే పార్లమెంట్కు వచ్చినట్లు కమల్ హాసన్ అన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్కు, సహకరించిన మిత్రపక్ష సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
సీఎన్ అణ్ణాదురై, మహాత్మా గాంధీ వంటి వారి బోధనల ప్రభావం తన భాష, ఆలోచన, రాజకీయాలపై ఉంటుందన్నారు.
"మన భాష, మన సంస్కృతి, మన హక్కులపై ఏ రకమైన దాడి జరిగినా ఎదిరించి నిలబడాలని అణ్ణాదురై మాకు నేర్పారు" అని అన్నారు కమల్ హాసన్.
"నేను ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నా. దీనిని స్పెల్ చెక్డ్ స్టోరీ ఆఫ్ ది లివింగ్ డెడ్ అని చెబుతాను. మేం ఓటు వేయాలనుకుంటున్నాం. కానీ, ఎలక్షన్ కమిషన్ మా ఓటు హక్కును తనిఖీ చేస్తోంది. స్పెల్లింగ్స్, అడ్రస్లో తప్పుల పేరుతో ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. మేం కేవలం ఓటు వేయాలని కోరుకుంటున్నాం" అన్నారు కమల్ హాసన్.
జగన్నాథ రథచక్రాలొస్తున్నాయ్..
కమల్ హాసన్ ఇంకా మాట్లాడుతూ...
"అక్షర దోషాలు కేవలం భాషలకు మాత్రమే శాపం, ఆధునిక సాహిత్యం విషయానికి ప్రాధాన్యతనిస్తూ వాటిని పట్టించుకోదు. ఇంటర్నెట్ కూడా అంతే" అని కమల్ హాసన్ అన్నారు. కానీ, "ఎన్నికల సంఘం మాత్రం అలా కాదు.
" ఈసీ అంటే ఇంగ్లిష్ కోచెస్ కాదు" అన్నారాయన.
ఆ దిశగా సహకరించేందుకు ఈసీ తిరస్కరించినా.. సాధించేదేమీ లేదని, సగం ఉడికిన, అసంపూర్తిగా మిగిలిపోయిన అక్రమంగా సాగిన ఎన్నికల ప్రక్రియ మాత్రమేనని కమల్ హాసన్ అన్నారు.
"భారతదేశమనే ప్రజాస్వామ్య రథం ముందుకు సాగుతూనే ఉంటుంది. రండి...ప్రజాస్వామ్యమనే శక్తితో ఈ రథాన్ని నడిపిద్దాం. లేదంటే దాని దారికి అడ్డుపడకుండా ఉందాం’’ అన్నారు కమల్.
‘‘...జగన్నాథ రథచక్రాలొస్తున్నాయ్.. వస్తున్నాయ్.." అంటూ శ్రీశ్రీ కవిత్వాన్ని ఆయన ప్రస్తావించారు.
"నేనేం చెబుతున్నానో తెలుగువారికి అర్థమవుతుంది" అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
‘‘ఈ ప్రజాస్వామ్య జగన్నాథ రథం విభేదాలను తొలగించాలి కానీ, ప్రజలను కాదు. అందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదు.
ఎవరూ శాశ్వతం కాదు. ఏ ప్రభుత్వమూ శాశ్వతంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకోకూడదు.
ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఇంతవరకూ ఆ లక్ష్యాన్ని సాధించలేదు, భవిష్యత్తులో కూడా జరగదు.
ఈ లిఖించని నియమం ఈ ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది.
మిత్రులారా, పిల్లలు చూస్తున్నారు. జెన్ జెడ్ చూస్తోంది.
అభివృద్ధి చెందుతున్న ప్రగతిశీల ప్రజాస్వామ్యంతోపాటు మనమూ పరిణితిని సాధిద్దాం.
కనీసం రేపటి రోజైనా మనదవుతుంది.’’ అని కమల్ హాసన్ అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)