You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ అయ్యే అవకాశమున్న మొజ్తబా ఖమేనీ ఎవరు?
- రచయిత, బీబీసీ పర్షియన్
- చదివే సమయం: 5 నిమిషాలు
అమెరికా - ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి తర్వాత, ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ కూడా ఈ దాడుల్లో మరణించారా? అని చాలామందిలో ప్రశ్నలు తలెత్తాయి.
గత కొద్దిరోజుల పాటు మొజ్తబాకు సంబంధించి ఎలాంటి వార్తలు బయటికి రాలేదు. కానీ, మార్చి 3న మొజ్తబా బతికే ఉన్నారని, దేశ అత్యంత కీలక విషయాలపై సంప్రదింపులు, సమీక్షలు జరుపుతున్నారని ఇరాన్ ప్రభుత్వ మీడియా రిపోర్ట్ చేసింది.
అయితే, ఆయన ఇప్పటి వరకు బయట కనిపించలేదు.
ప్రస్తుతం, తదుపరి సుప్రీం లీడర్ రేసులో మొజ్తబా ప్రముఖ పోటీదారుగా ఉన్నారని రెండు ఇరానియన్ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది.
అయితే, ఇలాంటి వాదనలను ధ్రువీకరించడం కష్టం.
ఇరాన్ తదుపరి సుప్రీం నాయకుడిని ఎన్నుకునే బాధ్యత ఎక్స్పర్ట్స్ ఆఫ్ అసెంబ్లీగా పిలిచే 88 సభ్యుల ధార్మిక సంస్థపై ఉంటుంది. ఈ సంస్థ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
అయితే, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్కు సన్నిహిత సంస్థగా పరిగణించే ఇరాన్ ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. ఖమేనీ అంత్యక్రియలకు ముందు ఎలాంటి ప్రకటన వెలువడే అవకాశం లేదు.
తన తండ్రిలా కాకుండా.. మొజ్తబా బయటికి పెద్దగా కనిపించేవారు కాదు. ఎలాంటి ప్రభుత్వ పదవీ నిర్వహించలేదు. బహిరంగ ప్రసంగాలు లేదా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఆయన ఫోటోలు, వీడియోలు చాలా తక్కువగానే ప్రచురితమయ్యాయి.
వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం, 2000ల చివర్లో వికీలీక్స్ విడుదల చేసిన యూఎస్ డిప్లొమాటిక్ డాక్యుమెంట్లు ఆయనను ''తెరవెనుక అసలైన శక్తి''గా అభివర్ణించాయి. ప్రస్తుత నాయకత్వంలో ''సమర్థవంతమైన, దృఢమైన నాయకుడిగా'' పరిగణించాయి.
కానీ, మొజ్తబా ఖమేనీ ఎంపిక వివాదానికి దారితీయొచ్చు. రాచరిక వ్యవస్థను కూలగొట్టి 1979లో ఇస్లామిక్ రిపబ్లిక్ అవతరించింది.
సుప్రీం లీడర్ ఎంపిక వంశపారంపర్యంగా కాకుండా మతపరమైన విశ్వాసం, నాయకత్వ సమర్థత ఆధారంగా ఎంపిక చేయాలన్న సైద్ధాంతిక భావజాలంపై ఆధారపడి ఉంటుంది.
ఇస్లామిక్ రిపబ్లిక్ను నడిపించే భవిష్యత్ నాయకుడిపై అలీ ఖమేనీ గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు.
రెండేళ్ల కిందట, ఎక్స్పర్ట్స్ ఆఫ్ అసెంబ్లీలోని ఒక సభ్యుడు మాట్లాడుతూ, తదుపరి ఇస్లామిక్ లీడర్ మొజ్తబా అనే ఆలోచనను ఆయన వ్యతిరేకించారని అన్నారు.
అయితే, అలాంటి ఊహాగానాలపై మొజ్తబా ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు.
అసలెవరీ మొజ్తబా ఖమేనీ?
మొజ్తబా ఖమేనీ ఈశాన్య ఇరాన్లోని మషద్ నగరంలో, 1969 సెప్టెంబర్ 8న పుట్టారు. అలీ ఖమేనీ ఆరుగురు సంతానంలో మొజ్తబా రెండవ సంతానం.
తెహ్రాన్లోని మతపరమైన 'అలావీ స్కూల్'లో పాఠశాల విద్య అభ్యసించారు.
ఇరాన్ మీడియా ప్రకారం.. ఇరాన్ - ఇరాక్ యుద్ధం జరిగే సమయంలో 17 ఏళ్ల వయసులోనే మొజ్తబా ఆర్మీలో కొంతకాలం పనిచేశారు.
ఈ యుద్ధంలో పశ్చిమ దేశాలు బహిరంగంగా ఇరాక్కు మద్దతు ఇచ్చాయి. అప్పటి నుంచి అమెరికా, పశ్చిమ దేశాలపై ఇరాన్కున్న అపనమ్మకం మరింత పెరిగింది.
1999లో తన మతపరమైన అధ్యయనాలను కొనసాగించేందుకు షియా సిద్ధాంతాల అధ్యయనానికి ప్రధాన కేంద్రమైన, పవిత్ర నగరం ఖోమ్కు వెళ్లారు మొజ్తబా.
అప్పటి వరకు మొజ్తబా మతపరమైన వస్త్రధారణ పాటించలేదు. ఆయన 30 ఏళ్ల వయసులో చదువుకోవడానికి మదర్సాకు ఎందుకు వెళ్లారో స్పష్టత లేదు. సాధారణంగా, ఈ విద్య చిన్నవయసులోనే ప్రారంభమవుతుంది.
మొజ్తబా ఇప్పటికీ ఒక మధ్యస్థాయి మతగురువుగా ఉన్నారు. ఆయన సుప్రీం లీడర్ అయ్యేందుకు ఇది అడ్డంకిగా మారొచ్చు.
ఇటీవల, కొన్ని మీడియా అవుట్లెట్లు, ఇరాన్ అధికారిక కేంద్రాలకు దగ్గరగా ఉండే అధికారులు మొజ్తబా ఖమేనీని ''అయతొల్లా'' అని పిలవడం మొదలుపెట్టారు.
ఈ మార్పును ఆయన మతపరమైన స్థాయిని పెంచి, దేశ అత్యున్నత నాయకత్వానికి విశ్వసనీయ అభ్యర్థిగా చూపించే ప్రయత్నంగా కొంతమంది పరిశీలకులు చూస్తున్నారు.
మదర్సా వ్యవస్థలో ''అయతొల్లా'' బిరుదును పొందడం, పెద్దయెత్తున మతపరమైన బోధనలను చేపట్టడం ఒకరి పాండిత్యం, జ్ఞానానికి నిదర్శనంగా పరిగణిస్తుంటారు.
భవిష్యత్ నాయకుడికి అవసరమైన వాటిలో ఇవి కూడా ఒకటి.
కానీ, ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఒక ఉదాహరణ ఉంది.
1989లో అలీ ఖమేనీ రెండో సుప్రీం లీడర్ అయినప్పుడు కూడా ''అయతొల్లా'' హోదా వెంటనే ఆయనను వరించింది.
రాజకీయ జోక్యంపై ఆరోపణలు
2005 అధ్యక్ష ఎన్నికల సమయంలో తొలిసారి మొజ్తబా పేరు చర్చకు వచ్చింది. అప్పుడు, బలమైన నేత మహమూద్ అహ్మదీనేజాద్ అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు.
సంస్కరణవాద (రీఫార్మిస్ట్) అభ్యర్థి మెహదీ కరౌబీ.. ఖమేనీపై ఆరోపణలు చేస్తూ రాసిన బహరింగ లేఖలో ఐఆర్జీసీ, బసీజ్ మిలిషియాకు చెందిన కొన్ని గ్రూపుల ద్వారా మొజ్తబా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారని పేర్కొన్నారు.
అహ్మదీనేజాద్ గెలుపు కోసం ఈ గ్రూప్లు మతసంస్థలకు డబ్బులు పంపిణీ చేశాయని ఆరోపించారు.
నాలుగేళ్ల తర్వాత.. మొజ్తబాపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.
అహ్మదీనేజాద్ మరోసారి ఎన్నికైన అనంతరం భారీయెత్తున నిరసనలు చెలరేగాయి, దీనినే గ్రీన్ మూమెంట్గా వ్యవహరిస్తారు.
ఖమేనీ తర్వాత మొజ్తబాను ఇరాన్ సుప్రీం లీడర్గా ఎంపిక చేయాలనే ఆలోచనను వ్యతిరేకిస్తూ కొంతమంది నిరసనకారులు నినాదాలు చేశారు.
అప్పటి డిప్యూటీ హోం మంత్రి మొస్తఫా తాజ్జాదే ఈ ఎన్నికల ఫలితాలను ''ఎలక్టోరల్ కూప్'' (ఎన్నికల తిరుగుబాటుగా) వర్ణించారు. ఆ తర్వాత ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. మొజ్తబా వల్లే ఇలా జరిగిందని ఆయన అన్నారు.
2009 ఎన్నికల తర్వాత ఇద్దరు సంస్కరణవాద నాయకులు మీర్ హుసేన్ ముసావీ, మెహదీ కరౌబీలను గృహ నిర్బంధం చేశారు.
నిరసనలను ఆపేయాలని కోరేందుకు 2012 ఫిబ్రవరిలో ముసావీని మొజ్తబా కలిసినట్లు ఇరానియన్ వర్గాలు బీబీసీ పర్షియన్కు తెలిపాయి.
ఒకవేళ మొజ్తబా సుప్రీం లీడర్గా ఎంపికైతే, తన తండ్రి అనుసరించిన కఠినమైన విధానాలనే కొనసాగిస్తారని చాలామంది విశ్వసిస్తున్నారు.
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో తన తల్లిదండ్రులను, భార్యను కోల్పోయిన ఎవరైనా.. పశ్చిమ ప్రాంతాల ఒత్తిడికి తలొగ్గడం అసాధ్యమని మరికొందరు భావిస్తున్నారు.
కానీ, ప్రస్తుత ఇస్లామిక్ రిపబ్లిక్ను నడిపించడం, దేశాన్ని రాజకీయ, ఆర్థిక గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడేసి ముందుకు నడిపించగలిగే సరైన వ్యక్తిని తానేనని నిరూపించుకోవడం ఆయన ముందున్న అసలైన సవాల్.
అంతేకాకుండా, ఇప్పటివరకూ ఆయన ఏ పదవిలోనూ లేకపోవడం వల్ల నాయకత్వం ఎలా ఉంటుందో తెలియదు. అలాగే, ఇస్లామిక్ రిపబ్లిక్ వంశపారంపర్య వ్యవస్థగా మారుతోందన్న భావన కూడా ప్రజల్లో మరింత అసంతృప్తిని రేకెత్తించవచ్చు.
ఒకవేళ తదుపరి సుప్రీం లీడర్గా ఎన్నికైతే, మొజ్తాబా కూడా లక్ష్యంగా మారతారు. ఎందుకంటే, వారసుడెవరైనా హతమారుస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇప్పటికే చెప్పి ఉన్నారు.
(బీబీసీ పర్షిషన్ అనేది పర్షియన్ భాషలో వార్తలందించే బీబీసీ న్యూస్కు చెందిన ఒక సర్వీస్. బీబీసీ పర్షియన్ను ఇరాన్ అడ్డుకుంటున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా 2.4 కోట్ల మంది వినియోగదారులు, వారిలో ప్రధానంగా ఇరాన్ నుంచే ఈ సర్వీసును అనుసరిస్తున్నారు.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)