చంద్రబాబు నాయుడు: ‘ప్రజలే నడిపించాలి’

ఫొటో సోర్స్, Screengrab

తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంతటి చరిత్రాత్మక ఎన్నికలను ఎన్నడూ చూడలేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఉండవల్లిలో జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబు కూటమి విజయంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన ఏకపక్ష తీర్పు సువర్ణాక్షరాలతో లిఖించదగినదన్నారు. ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తామని, రాష్ట పునర్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం ఏదంటే అది చేస్తానంటే ప్రజలు క్షమించరనే విషయాన్ని ఈ ఎన్నికలు నిరూపించాయని చెప్పారు.

ప్రజలు తమకు కట్టబెట్టింది అధికారం కాదని, బాధ్యతని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే తపనతో పొరుగు రాష్ట్రాలతోపాటు, విదేశాల నుంచి కూడా వచ్చి ఓటు వేశారన్నారు. దీని ఫలితంగా రికార్డు స్థాయి మెజార్టీలు వచ్చాయని చెప్పారు.

అసెంబ్లీలో తనకు, తన భార్యకు జరిగిన అవమానం ఎంతో ఆవేదనకు గురిచేసిందని, అందుకే కౌరవసభలో ఉండలేనని, దానిని గౌరవసభ చేశాకే తిరిగి అడుగుపెడతాననే తన ప్రతిజ్ఞకు ప్రజలు సహకరించారని అన్నారు.

కూటమి ఏర్పాటులో పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారని, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలనూ కూటమిలోని పార్టీలన్నీ తమవిగానే భావించి కలసికట్టుగా పనిచేశాయని చంద్రబాబు చెప్పారు.

ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలన్నదే తమ అభిమతమన్నారు.

తాము చేసే పనులపై ప్రజలు ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని చంద్రబాబు కోరారు.

ఈసందర్భంగా ఆయన పవన్ కల్యాణ్‌కు, బీజేపీ అగ్రనాయకత్వానికి, పురందేశ్వరికి అభినందనలు చెప్పారు.

టీడీపీ ఘన విజయం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధించింది. సొంతంగా 135 సీట్లను కైవసం చేసుకుంది. జనసేన పార్టీ 21 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 8 స్థానాలను కైవసం చేసుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)